ఇంజనీరింగ్ సమీక్షలో చైర్మన్ ప్రణవ్ గోపాల్
వి ఎం ఆర్ డీ ఏ చేపడుతున్న పనుల ప్రగతిపై సమావేశ మందిరంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ ఇరువురు డివిజన్ల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా వి ఎం ఆర్ డీ ఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ఇప్పటికే పూర్తయిన లేఅవుట్లు స్థలాలను ఆక్షన్ ద్వారా విక్రయించి సంస్థకు ఆర్ధిక పరిపుష్టి చేకూరేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఇంజనీర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని,అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని, నిర్దేశించిన కాలపరిమితిలోగా పనులను ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను కలసికట్టుగా చేరుకొని పురోగతిని సాధిద్దామన్నారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ బృహత్ ప్రణాళిక రహదారుల నిర్మాణంలో అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను తరలించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని, రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న యజమానులకు టీడీఆర్ పంపిణీ చేసే విధంగా జీవీఎంసీ అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. అదేసమయంలో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, కార్యదర్శి మురళీకృష్ణ, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజనీర్లు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
