సెల్లార్ ఆక్రమించిన వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి.
– లేదంటే కూల్చేస్తాం
– జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ప్రభాకర్ రావు.
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ లో పలు జోన్ల పరిధిలో ఆపరేషన్ లంగ్స్ 3.0 లో భాగంగా వాణిజ్య, వ్యాపార సముదాయాలలో, పలు అపార్ట్మెంట్లలో సెల్లార్/స్టిల్ట్ ఫ్లోర్లలో వ్యాపారాలకు వినియోగిస్తున్న 11 ఆక్రమణలను 25, 26వ తేదీలలో తొలగించడం జరిగిందని, సెల్లార్ ఫ్లోర్లను ఆక్రమించిన వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వెంటనే తొలగించుకోవాలని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు గురువారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
నగర పరిధిలో ప్రజలు, వాహనదారులు రోడ్లపై, ఫుట్ పాత్ లపై, బహిరంగ ప్రదేశాలలో వారి వారి వాహనాలను పార్కింగ్ చేస్తున్నందువలన రోడ్లు ఇరుకునకు గురై ట్రాఫిక్ నకు అంతరాయం కలుగుతున్నందున ప్రజలు, వాహనదారుల ఇబ్బందులకు గురవుతున్నారని, వారి సౌకర్యార్థం వాణిజ్య సముదాయాలు, పలు అపార్ట్మెంట్లలో సెల్లార్/స్టిల్ట్ ఫ్లోర్లను పూర్తిగా కేవలం వాహనాలు నిలుపుకొనే సౌకర్యార్ధం ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో ఇప్పటికే ప్రారంభమైన ఆపరేషన్ లంగ్స్ 3.0 లో భాగంగా మధురవాడ, నార్త్, ఈస్ట్, వెస్ట్, గాజువాక, అనకాపల్లి జోనులలో 11 సెల్లార్/స్టిల్ట్ ఫ్లోర్ల ఆక్రమణలను జివిఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పోలీస్ వారి సహకారంతో తొలగించడం జరిగిందని ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి తెలిపారు.
ఆపరేషన్ లంగ్స్ 3.0 లో భాగంగా మధురవాడ 8వ వార్డులో మిధిలాపురి కాలని వద్ద ఒక ఆక్రమణ, నార్త్ జోనులో 14వ వార్డులో సీతమ్మధార వద్ద గోడౌన్, 43వ వార్డులో దొందపర్తి వద్ద ఒక ఆక్రమణ, వెస్ట్ జోనులో 90వ వార్డులో ఎన్.ఎ.డి. జంక్షన్ వద్ద ఒక ఆక్రమణ, ఈస్ట్ జోనులో 15వ వార్డులో ఇసుకతోట వద్ద కృష్ణ మందిర్ ఎదురుగా ఒక ఆక్రమణ, 13వ వార్డులో దారపాలెం వద్ద ఒక ఆక్రమణ, గాజువాక జోనులో 67వ వార్డులో గాజువాక మెయిన్ రోడ్ హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు వద్ద స్టోరేజ్ మెటీరియల్ ను, సౌందర్య వద్ద స్టోరేజ్ మెటీరియల్ ను, అనకాపల్లి జోనులో 82 వ వార్డులో ఎ పీ ఎన్ ఆర్ కాంప్లెక్స్, ఎమ్మార్వో ఆఫీసు రోడ్ వద్ద ఒక షాపును, పూడిమరక రోడ్డు వద్ద రెండు ఆక్రమణలు తొలగించడం జరిగిందని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. నగరంలో ఆపరేషన్ లంగ్స్ 3. 0 లో భాగంగా సెల్లార్/స్టిల్ట్ ఫ్లోర్ల ఆక్రమణలను తొలగించడం జరుగుచున్నందున, ఇప్పటికే పలు సెల్లార్/స్టిల్ట్ ఫ్లోర్లలో పార్కింగ్ కోసం కాకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాలను వెంటనే స్వచందంగా ఆక్రమణదారులు తొలగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా జోనుల సహాయక ప్రణాళిక అధికారులు, ప్రణాళిక విభాగం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
