ఆరో రోజు ప్రవచిస్తున్న సామవేదం షణ్ముఖ శర్మ
వ్యాస భాగవతంలోని గజేంద్రమోక్షణం జీవుడి వేదనేననిప్రవచనవిరించి, వాగ్ధేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషి పీఠం, సత్సంగం, విశాఖపట్నం ఆధ్వర్యాన ఎంవీపీ కాలనీ, ఆరో సెక్టార్, ఎబీసీ పార్కులో 14 రోజుల శ్రీమద్భాగవవ ప్రవచన యజ్ఞం ఆరో రోజైన మంగళవారం సాయంత్రం ప్రవచనంలో గజేంద్రమోక్షణం సంస్ఋత శ్లోకాలు,పోతన పద్యాలతో ఆద్యంతం ప్రవచనకర్త ఆసక్తికరంగా ఆవిష్కరించారు. కాసారాన్ని సంసారంతో ఏనుగు కథను మనిషి తన కథగా అన్వయించి చూసుకుంటేనే ఇందులో నీతి బోధపడుతుందన్నారు. లావొక్కింతయులేదు/ధైర్యంబు విలోలంబయ్యె/ ప్రాణంబుల్ ఠావుల్దప్పె.. వంటి రమ్యమైన పద్యాలు భాగవతంలో కోకొల్లలుగా ఉన్నాయన్నారు. గజేంద్రమోక్షణంలో ఏనుగు పరమాత్మను ప్రార్థించడంలో ఉద్దేశం ఆ మొసలి నుంచి బైట పడాలని మాత్రమే కాదని గ్రహించాలన్నారు. శరీరం, మనస్సు, బుద్ధి తరచూ మారిపోతుంటాయి. కాలంతో మారిపోయే లక్షణమున్నవన్నీ అనాత్మలు. ఈ శరీరంలో కాలంతో పాటు మారిపోయే ఆవరణ ఉంది. అజ్ఞానం నుంచి విడుదలవ్వడమే మోక్షం అని సామవేదం వివరించారు. పరమాత్మ స్ఫురణ లేనివారంతా పశువులే. పాశముచేత బంధింపబడ్డవారు పశువులు. ఆర్తితో మొదలై ముక్తికి అవసరమైన జ్ఞానంతో భగవత్ తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గజేంద్రుడి భక్తి సంస్కారాన్ని దేవతాలోకం మెచ్చకుంది. జీవితం ఒక యుద్ధం. ప్రతి జీవుడూ నిజానికి ఒంటరివాడే.ఎక్కడ ఉంటే అక్కడ గొప్పగా ఉండటమే యోగం. భగవంతుడి స్మరణలో ఉండటమే గొప్ప యోగం. భగవంతుడంటే విశ్వవ్యాపకుడు. విశ్వమంతా తానై ఉన్నవాడు. భగవంతుడు అన్నింటా నిఘూడుడై ఉంటాడు. అనేక రూపాలలో కనిపించినా భగవంతుడు ఒక్కడే అన్నారు. అదే సనాతన ధర్మ విశేషమన్నారు. నిరంతరం భగవత్ తత్వాన్ని మననం చేసేవాడే ముని. ప్రవచన ప్రారంభంలో మహామహోపాధ్యాయ దోర్భల ప్రభాకర శర్మ ప్రవచనరక్త సామవేదం షణ్ముఖ శర్మకు మంగళాశీస్సులందజేశారు.
