చోడవరం హై స్కూల్ ను సందర్శించిన అకాడమిక్ ఫోరం బృందం
జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో జిల్లా అకాడమిక్ ఫోరం బృందo గురువారం చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించింది. 8 మంది సభ్యులు గల ఈ బృందానికి జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ సత్యనారాయణ , మాకవరపాలెం మండల విద్యాశాఖ అధికారి పి.ఎస్.ఎన్ మూర్తి నేతృత్వం వహించారు.బృంద సభ్యులుగా గోపాల్, నాగేశ్వరరావు, వాసు, సోమేశ్వరరావు ,రాజు, చిన్నరావు ఉన్నారు.ఈ బృంద సభ్యులు పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల ప్రగతిని పరిశీలించి, వెనుకబడిన విద్యార్థులపై పాఠశాల ఉపాధ్యాయ బృందo తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి వందరోజుల ప్రణాళికా రికార్డులను , పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వహిస్తున్న రిజిస్టర్ లను, లెసన్ ప్లాన్లను పరిశీలించారు.పాఠశాలకు వచ్చిన గ్రాంట్ల వివరాలను,బిల్లులను కూడా పరిశీలించారు.
అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాలలో పరిశీలనా అంశాలను ఉపాధ్యాయుల సమీక్ష సమావేశంను నిర్వహించి, సబ్జెక్టుల వారీగా
ఉపాధ్యాయులకు సూచనలు,సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి పాండురంగారావు సింహాచలము పాల్గొన్నారు.
