వైసీపీ నేతలు దిగజారిపోయారు
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రత్నకుమారి ధ్వజం,రాజకీయ నాయకులంటే హుందాగా వ్యవహరించాలని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి మండిపడ్డారు. వైసీపీ నేతలు దిగజారుడు వ్యవహారశైలి, రాయడానికి వీలులేని రోత మాటలతో ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేతలకు ప్రజలు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా వారికి బుద్ధి రావడంలేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషించిన కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తినొచ్చినా అంబటి రాంబాబుకు సిగ్గు రాలేదని వ్యాఖ్యానించారు. కోర్టు రిమాండ్ విధించినప్పుడు బయటకు వస్తూ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి నట్టు చేతులు ఊపిన అంబటి రాంబాబు…మళ్లీ పుష్ప రేంజ్ లో గడ్డం కింద చెయ్యి పెట్టి తగ్గేదేలే అంటూ రెచ్చిపోవడం వైసీసీ రప్పా రప్పా రాజకీయానికి నిదర్శనం.మహిళల గురించి నీచంగా మాట్లాడిందే కాకుండా తప్పు చేశానని భావన కూడా లేకుండా తగ్గేదే లేదు అని సిగ్గు లేకుండా అంటున్న అంబటిని చూసి మహిళా లోకం చీదరించుకుంటోందని రత్నకుమారి విమర్శించారు. యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టు కూటమి క్యాడర్ ను రెచ్చగొట్టేలా మాట్లాడటం, ఉద్దేశపూర్వకంగా కొందరిని అసభ్య పదజాలంతో దూషించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. అంబటి రాంబాబు లాంటి వాళ్లు రాజకీయాలను భ్రష్టపట్టిస్తున్నారని, హుందాతనం అనేది లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు?రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక బూతులతో దాడులు చేస్తున్నారని రత్నకుమారి మండిపడ్డారు. కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరలచడానికి ఎంతకైనా దిగజారుతున్నారని, కన్న తల్లి, తోడబుట్టిన చెల్లెళ్లను కూడా తన రాజకీయ లబ్ధి కోసం అసభ్యంగా తిట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాడని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక, వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావనే భయంతో వైసీపీ నేతలను జగన్ రెడ్డి జనం మీదకు వదులుతున్నాడని, కూటమి నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయిస్తూ, దాడులతో రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నాడని రత్నకుమారి దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా ప్రభుత్వం ఉపేక్షించదని, న్యాయబద్ధంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని రత్నకుమారి హెచ్చరించారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెదుల సూర్య ప్రభ, లక్ష్మి, పావని, అరుణ, తులసి, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
