డయల్ యువర్ సీఎండీకి విశేష స్పందన సత్వర పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఆదేశాలు విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ప్రారంభించిన డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 48 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటులో ఇబ్బందులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడిలో జాప్యం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఎస్టిమేషన్లు, విద్యుత్ లైన్ల మార్పు, విద్యుత్ బిల్లులు, విద్యుత్ లైన్లు స్తంభాల మార్పిడి, విద్యుత్ స్తంభాలపై వైర్లు వేలాడుతుండడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేంత వరకు కార్పొరేట్ కార్యాలయ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 9493681912 కు చాట్ చేయడం ద్వారా కూడా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎం వి.విజయలలిత, జీఎం ఎం.ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.
