జగన్ రెడ్డి – హిందూ ద్రోహానికి నిదర్శనం
– లడ్డూ కల్తీ నుంచి ఆలయాలపై దాడులు
– వైసీపీ హయాంలో అన్నీ అపవిత్రమే
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కేంద్ర బడ్జెట్ దేశ భవితకు బంగారు బాట వేసేలా బడ్జెట్ రూపొందించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అన్నారు. ఆదివారం
కేంద్ర బడ్జెట్–2026పై బీజేపీ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు, స్థిరమైన ఉపాధి అవకాశాలు, దేశానికి దీర్ఘకాలిక ఆదాయ వనరులు సృష్టించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందన్నారు. ఈ చారిత్రక బడ్జెట్కు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దేశ అభివృద్ధికి తోడ్పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని అభినందించారు.
కలియుగ దైవంగా కోట్లాది భక్తులు నమ్మే శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదానికే అవినీతి మచ్చ తేవడం వైసీపీ పాలనలో జరిగిన అత్యంత నీచమైన చర్య అని ధ్వజమెత్తారు. ఎన్డీడీబీ నివేదికలు, ఇతర ల్యాబ్ రిపోర్టులను పరిశీలిస్తే లడ్డూ తయారీలో కల్తీ జరిగిన విషయం ఎలాంటి సందేహానికి తావు లేకుండా స్పష్టంగా తేలుతోందని తెలిపారు. అధికారిక నివేదికలు కల్తీని నిర్ధారిస్తుంటే, మాజీ ముఖ్యమంత్రి ఒకవైపు “కల్తీ లేదని” చెబుతుండడం, అదే సమయంలో మాజీ టీటీడీ చైర్మన్ మాత్రం “కల్తీ జరిగింది” అని ఒప్పుకోవడం వైసీపీ లోపలి విరుద్ధతలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. విచారణల్లో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం సుమారు 20 కోట్ల లడ్డూలు, దాదాపు 68 లక్షల కిలోల మేర “నెయ్యిగా పిలవబడే” పదార్థాన్ని ఉపయోగించినట్టు తేలిందన్నారు. రోజుకు 70 వేల నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకునే తిరుమలలో, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో కేవలం లడ్డూ వ్యవహారమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగినా నామమాత్ర కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారని ఆరోపించారు. ఆలయాలపై దాడులు, హిందువులపై దాడులు జరిగినా ప్రభుత్వ నిర్లక్ష్యంతో దోషులు శిక్ష తప్పించుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షులు పరశు రామరాజు తదితరులు పాల్గొన్నారు.
