- ఐ బొమ్మ రవి ఖతర్నాక్..!
- బెట్టింగ్, గేమింగ్ యాప్ ఈజీ మనీ
- యాడ్ బుల్ కంపెనీ రవిదే
- సీసీఎస్ అడిషనల్ సీపీ శ్రీవివాస్
(హైదరాబాద్, జయజయహే)
ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఐబొమ్మ రవి కేసుపై సీసీఎస్ అడిషినల్ సీపీ శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవికి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వచ్చేవని అన్నారు. యాడ్ బుల్ కంపెనీ రవికి చెందినదేనని తెలిపారు. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బుల్ని యాడ్ బుల్ కంపెనీకి మళ్లించారని చెప్పారు. ఇమంది రవి ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల వరకు సంపాదించాడని వెల్లడించారు. సీపీ శ్రీనివాస్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఐబొమ్మ, బప్పం సైట్లను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేశాడు. ఐబొమ్మ రవి ఓవర్ కాన్ఫిడెన్స్తోనే దొరికాడు. రవి భార్య మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరికొన్ని పైరసీ వెబ్సైట్లు నడుస్తూనే ఉన్నాయి. మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పైరసీ సైట్లు ఇంకా నడుస్తున్నాయి. పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకునే పనిలోనే ఉన్నాం. ఐబొమ్మ పాపులర్ అయ్యాక.. దానిపేరును చాలామంది వాడుకుంటున్నారు. సినిమా సమీక్షలకు కూడా ఐబొమ్మ సైట్ పేరు వాడుకుంటున్నారు. భవిష్యత్లో వెబ్-3 టెక్నాలజీ కూడా రాబోతుంది. వెబ్-3 టెక్నాలజీతో పైరసీ చేస్తే పట్టుకోవడం కష్టం’ అని అన్నారు. కాగా, సోమవారం సాయంత్రంతో ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది. చివరి రోజు కస్టడీలో అధికారులు 3 గంటల పాటు అతడ్ని విచారించారు. విచారణలో రవి నుంచి పోలీసులు ఎలాంటి సమాధానాలు రాబట్టలేకపోయారని తెలుస్తోంది.
