20 ఏళ్ల నాటి ఘటన గుర్తు చేసుకున్న గంటా*
సాయం కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది జీవితాల్లో పి-4 వెలుగులు నింపుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మధురవాడ వి కన్వెన్షన్ లో సోమవారం జరిగిన పి-4 వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశం అందరికీ ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వడాన్ని మించిన సంతృప్తి ఉండదని పేర్కొన్నారు. చోడవరం ఎమ్మెల్యేగా 2004 నుంచి 2009 వరకు ప్రతి నెల 600 మంది నిరుద్యోగులకు స్వచ్ఛందంగా రూ. వెయ్యి చొప్పున భృతి ఇచ్చానని తెలిపారు. ఈ భృతితో చదువుకున్న ఒక యువకుడు ఐ.ఆర్.ఎస్.కు ఎంపికై.. తర్వాత కాలంలో అనేకమంది యువతకు అండగా నిలవడం ఆనందం కలిగించిందన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న తపన, సంకల్పమే ఎవరినైనా ముందుకు నడిపిస్తాయని పేర్కొన్నారు. పాత రోజుల్లో గ్రామాల్లో కుటుంబంలో పెద్ద ఎవరైనా దూరమైతే ఊరు ఊరంతా అండగా నిలబడేదని.. ఆధునిక యుగంలో మానవ సంబంధాలు క్షీణించాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పి 4 కాన్సెప్ట్ ను ప్రభుత్వమే చేపట్టి ప్రజలను భాగస్వామ్యం చేయడం ముదావహమన్నారు. పి 4 లో కేవలం ఆర్థిక సాయమే చేయాలనే భావన సరి కాదని, మౌలిక సౌకర్యాల కల్పన.. నైపుణ్యాభివృద్ధి.. మానవ వనరుల వినియోగం వంటివి దీని కిందకే వస్తాయని వెల్లడించారు.
