క్రూరంగా హత్య చేసిన ప్రియుడు
తల, కాళ్లు నరికి ధారపాలెంలో దగ్థం
మరికొన్ని బాగాలు ఫ్రిజ్ లో, ఇంకొన్ని ట్రాలీ బ్యాగ్ లు
స్నేహితుడు సూచనలో హత్యానంతరం స్టేషన్ లో లొంగుబాటు
డేటింగ్ యాప్ లో మూడేళ్ల క్రితం ప్రేమాయణం
డబ్బు కోసం వివాదమే హత్యకు కారణంగా అనుమానం
గాజువాక ఎల్వీ నగర్ లో సంచలన హత్య
యువతిని ఇంటికి పిలిచాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. అత్యంత క్రూరంగా చంపేశాడు. శరీరాన్ని ముక్కలు చేసి మూడు కవర్లలో వేశాడు. రెండు కవర్లను ఫ్రిజ్లో పెట్టాడు. మరో భాగాన్ని, యువతి ఫోన్ను వేరేచోటుకు తీసుకెళ్లి తగలబెట్టాడు. చివరికి స్నేహితుడి సూచనతో పోలీసులకు లొంగిపోయాడు. విశాఖలో సంచలనం సృష్టించిన యువతి మౌనిక దారుణ హత్య కేసులో పోలీసులు కారణాలు కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. నిందితుడు రవీంద్ర ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన ఫ్లాట్కి పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మౌనికను క్రూరంగా నరికి చంపాడు. తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసి మూడు కవర్లలో పెట్టాడు. రెండు కవర్లను ఫ్రిజ్లో ఉంచాడు. తల, ఫోన్ను ధారపాలెంలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఏంచేయాలో తెలియక స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. చేసింది పెద్ద నేరమని, వెంటనే పోలీసులకు లొంగిపొమ్మని స్నేహితుడు సలహా ఇచ్చాడు. వెంటనే నిందితుడు గాజువాక ఠాణాకు వెళ్లి సరెండర్ అయ్యాడు. జరిగిన విషయమంతా పోలీసులకు వివరించాడు. కవర్లలో శరీర భాగాలు : నిందితుడు చెప్పిన సమాచారంతో పోలీసులు అతడి ఇంటిని క్షుణ్నంగా పరిశీలించారు. ఎలాంటి రక్తపు మరకలు కనిపించలేదు. ఫ్రిజ్ తెరిచి చూశారు. అందులోని కవర్లలో శరీర భాగాలను చూసి హత్యను నిర్ధారించుకున్నారు. ఎందుకు చంపాల్సి వచ్చిందని రవీంద్రను ప్రశ్నించారు. మౌనిక పదేపదే డబ్బు కోసం వేధిస్తోందని ఇప్పటికే కొంత సొమ్ము ఇచ్చానని చెప్పాడు. మళ్లీ డబ్బు డిమాండ్ చేస్తోందని పోలీసులకు తెలిపాడు. పైగా తన ఐడీ కార్డు తీసుకుందని చెప్పుకొచ్చాడు. వేధింపులు భరించలేకే అంతం చేశానని విచారణలో వెల్లడించాడు. నిందితుడి ఆరోపణలను మౌనిక తండ్రి కొట్టిపారేశారు. మౌనిక పీఎన్ బీ లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తోందని, మధ్యలో ఈవెంట్లు సైతం నిర్వహించేదని చెబుతున్నారు. హత్య నుంచి తప్పించుకునేందుకే రవీంద్ర ఇంలాంటివి తెరపైకి తెచ్చాడని అంటున్నారు. నిందితుడు రవీంద్ర నేవీ ఉద్యోగి. సొంతూరు విజయనగరం జిల్లా రాజాం. లాక్డౌన్ సమయంలో డేటింగ్ యాప్లో మౌనిక పరిచయమైంది. తర్వాత మరో యువతిని రవీంద్ర పెళ్లి చేసుకున్నాడు. ఏడాది క్రితం ఎల్వీ నగర్లోని కీర్తి ఎన్క్లేవ్ అంపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. నెలలు నిండటంతో భార్యను అత్తగారింటికి పంపించాడు. ఎలాగైనా మౌనికను అంతం చేయాలని నిర్ణయించుకున్న రవీంద్ర గాజువాక డీమార్ట్లో, ఆన్లైన్లో కత్తులు కొన్నాడు. ఆదివారం మౌనికను ఇంటికి పిలిచాడు. ముందుగానే సిద్ధం చేసుకున్న పెద్ద కత్తితో హత్య చేశాడు. రక్తపు మరకలు కనిపించకుండా ఫినాయిల్తో తుడిచేశాడు. వాసన రాకుండా సెంట్ కొట్టాడు. దర్యాప్తులో పోలీసులు ఇవన్నీ గుర్తించారు. రవీంద్ర ఎప్పుడూ సైలెంట్గా తనపని తాను చేసుకునేవాడని, తమని పలకరించేవాడు కాదని అపార్టుమెంట్ వాసులు చెబుతున్నారు.
డబ్బు వివాదంతోనే..
గాజువాక ఠాణా నుంచి అపార్టుమెంట్కు రవీంద్రను తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు. ఈ సమయంలో యువతి బంధువులు రవీంద్రపై చేయి చేసుకున్నారు. మరోవైపు మౌనిక శరీర భాగాలను కేజీహెచ్ కు తరలించారు. రవీంద్రపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు అతను చెబుతున్న దాంట్లో నిజమెంత? డబ్బు వివాదంతోనే ఆమెను చంపాడా? లేక మరో కారణం ఏమైనా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
