ఏప్రిల్ నుంచీ భూ సేకరణ
` కేంద్ర సూచనలతో మళ్లీ డీపీఆర్
` కూటమి సర్కార్ మార్పులతో ఆగిన టెండర్లు
దశాబ్ద కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విశాఖ మెట్రో ఇంకా పట్టాలెక్కలేదు. కేంద్ర పట్టణాభివద్దిశాఖ జోక్యంతో మళ్లీ డీపీఆర్ సిద్దం చేయనుంది. అందుకు రైట్స్ సంస్థ ద్వారా రెండు మాసాల్లో డీపీఆర్ సిద్దం చేయించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. కేంద్ర సూచనలతో రాష్ట్ర ప్రభుత్వ కొత్తగా సర్వే చేపట్టింది. విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి కొమ్మాది మద్య డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ మెట్రో నిర్మాణం చేపట్టాలని రాష్ట్రం ప్రతిపాదించింది. దీనికి భిన్నంగా డబుల్ డెక్కర్ అక్కర్లేదని నేషనల్ హైవే మధ్యలో కారిడార్ నిర్మించి మెట్రో నడపడం ఉత్తమమని కేంద్రం అభిప్రాయపడింది. డబుల్ డెక్కర్ వల్ల అంచనా వ్యయం భారీగా పెరగడంతో పాటు ప్రయాణీకుల నుంచి ఆదరణ అంతంత మాత్రమే ఉంటే భారీగా నష్టపోతామని గ్రహించిన కేంద్రం ఈ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రం మళ్లీ డీపీఆర్ మార్చే పనిలో పడింది.
మెట్రో తొలిదశలో 46.22 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లతో 43 స్టేషన్లతో నిర్మించనున్నారు. ఎనఏడీ కొత్తరోడ్, తాటిచెట్లపాలెం, గురుద్వారా , మద్దిలపాలెం హనుమంతవాక వంటి ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్టేషన్లు రానున్నాయి. వీటి నిర్మాణానికి దాదాపు రూ. 11498 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఏప్రిల్ నుంచీ భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రైట్స్ సంస్థ చేపట్టే సర్వేలు ఆధారంగా ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అంటే వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టును పట్టాలపైకి ఎక్కించాలని ఉవ్వీళ్లూరుతోంది. విశాఖలో సెమీ రింగ్ రోడ్డుతో పాటు మెట్రో నిర్మాణాన్ని వేగవంతం చేసి ఎన్నికలకు వెళ్లాలని కూటమి సర్కార్ భావిస్తోంది.
