ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్
బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు ఇటీవల తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడును వెంటబెట్టుకొని తిరిగి భక్తుల మనోభావాలకు దెబ్బతీశారన్నారు. బీఆర్ నాయుడిపై మహిళల పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన్ను టీటీడీ చైర్మన్గా నియామించి చంద్రబాబు తప్పు చేశారన్నారు. ఆయన అశ్లీల వీడియోలు బయటకు వచ్చినా కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని, కూటమి ప్రభుత్వం అండదండల వల్లే బీఆర్ నాయుడు అహంకారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన చైర్మన్గా ఉండటంతో టీటీడీ నిధుల వినియోగంలో కూడా భారీ ఎత్తున అవకతవకలు జరిగే అవకాశం ఉందని, నెయ్యి టెండర్ ధరలను పెంచడం ద్వారా దేవస్థానానికి భారీ నష్టం జరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేక పాలనా వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు టీవీ5 సంస్థ ద్వారా అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తిరుమలలో భక్తులకు సరైన సౌకర్యాలు లేవు, దర్శన వ్యవస్థలో లోపాలున్నాయని, తొక్కిసలాట ఘటనలు, భద్రతా లోపాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా ఆమె ఉద్ఘాటించారు. కూటమి ప్రముఖులకు త్వరిత దర్శనం, సాధారణ భక్తులకు ఇబ్బందులు అన్యాయం చేయడం దారుణమని, చంద్రబాబు కుటుంబ కార్యక్రమాల్లో బీఆర్ నాయుడి పాల్గొనడం తప్పుడు సందేశం వెళుతుందన్నారు.
