ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ వెల్లడి
విద్యుత్ వినియోగదారులు సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చినట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంలో 43 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడిలో జాప్యం, విద్యుత్ కనెక్షన్ల ఎస్టిమేషన్లు, రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటులో ఇబ్బందులు, విద్యుత్ లైన్ల మార్పు, విద్యుత్ బిల్లులు, విద్యుత్ లైన్లు, స్తంభాల మార్పిడి, విద్యుత్ స్తంభాల మధ్య వైర్లు వేలాడుతుండడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 9493681912 కు చాట్ చేయడం ద్వారా కూడా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ టి.వనజ, సీజీఎంలు వి.విజయలలిత, ఎల్.దైవప్రసాద్, జీఎం ఎం.ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.
