రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం, బలోపేతాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకుని విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై విస్తృత చర్చ జరిగింది. మండల, గ్రామ, బూత్ స్థాయిల్లో కమిటీలను చురుకుగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని నేతలు సూచించారు. ప్రతి వర్గం, కులానికి సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ కేడర్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యమని చెల్లుబోయిన వేణు తెలిపారు. యువత, మహిళలు, కార్యకర్తలను పార్టీలో క్రియాశీలకంగా భాగస్వాములను చేయాలని జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని నేతలు స్పష్టం చేశారు.
