కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత
2014-19లో భారీఎత్తున ఎన్టీఆర్ ఇళ్లు, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
కూటమి రాకతో టిడ్కో ఇళ్లకు మహర్దశ
పేదల సొంతింటి కల సీఎం చంద్రబాబు నెరవేర్చారని, టిడ్కో గృహ సముదాయాలను విశాలమైన రహదారులు, మెరుగైన సౌకర్యాలతో లబ్ధిదారులు అందజేశారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. టౌన్ షిప్ మాదిరిగా టిడ్కో గృహ సముదాయలను అభివృద్ధి చేశారన్నారు. 2019 నాటికే టిడ్కో ఇళ్లన్నీ 90 శాతం పనుల పూర్తయ్యాయని, తరవాత వచ్చిన జగన్ మిగిలిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడంలో విఫమయ్యారని మండిపడ్డారు. చివరికి కడపలో టిడ్కో ఇళ్లను సైతం పూర్తిచేయాలని చేతకాని నాయకుడు జగన్ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం రాకతోనే పేదలకు టిడ్కో ఇళ్లు అప్పగించే పని చేపట్టామన్నారు. నగరంలోని లక్ష్మీనగర్ లో సోమవారం టిడ్కో గృహ సముదాయాల్లో లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డితో కలిసి ఇన్చార్జి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటిసారిగా పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనన్నారు. ఆయన స్ఫూర్తిగా పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య కాలంలో ఎన్టీఆర్ ఇళ్లు, టిడ్కో ఇళ్లను నిర్మించి పేదలకు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. పేదల సొంతింటి కల టీడీపీ, కూటమి ప్రభుత్వాలతో సాధ్యమన్నారు. సీఎం చంద్రబాబు మహిళా పక్షపాతి అని, వారి అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారన్నారు. ఈ పథకాలను అందరూ అందుకున్నారా..? అంటూ సభకు హాజరైన మహిళలను మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు. అందుకు వారంతా అందుకున్నామని తెలపడంతో, మంత్రి సవిత సంతృప్తి వ్యక్తంచేశారు.
