ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, దివ్యాంగుల స్టేడియం*
* సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీల ప్రారంభోత్సవంలో గంటా*
రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కు విశేషమైన ప్రాధాన్యాన్ని ఇస్తోందని.. విశాఖను స్పోర్ట్స్ హబ్ గా తీర్చి దిద్దుతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మధురవాడ ఏసీఏ – వీడీసీఏ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ను శనివారం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద విద్యార్థులు, క్రీడాకారులకు ఇవ్వాలన్న నిర్వాహకుల ఆలోచనను అభినందించారు. మ్యాచ్ లు వీక్షించడానికి ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత పాసులను ఇస్తున్నారన్నారు. సినీ, టీవీ నటుల టీంలు నాలుగు.. పోలీస్, బ్యూరోక్రాట్స్, ప్రజా ప్రతినిధుల టీంలు ఒక్కొక్కటి మొత్తం 7 టీంలు లీగ్ లో పాల్గొంటున్నాయని చెప్పారు. విశాఖ స్టేడియం మ్యాచ్ తర్వాతే ధోనీకి పాపులారిటీ పెరిగిందన్నారు. ప్రతిభ చూపించిన క్రీడాకారులకు ఉన్నత ఉద్యోగం, ఇంటి స్థలం, నగదు ప్రోత్సాహాకాలు అందజేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని పేర్కొన్నారు. కొమ్మాదిలో 25 ఎకరాల్లో హైదరాబాద్ గచ్చిబౌలి వంటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రానుందని.. దివ్యాంగుల ప్రత్యేక స్టేడియం కూడా ఆ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వివరించారు. ఆటగాళ్లను గంటా పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. క్రికెట్ ట్రోఫీని.. ఆటగాళ్ల జెర్సీ లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, శాప్ చైర్మన్ రవినాయుడు, సినీ హీరో శ్రీకాంత్, సీఎంఆర్ అధినేత మావూరి వెంకట రమణ, నిర్వాహకులు రాంబాబు, కాశీ, ఏసీపీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
