ముగిసిన అంతరాష్ట్రీయ యువజన మార్పిడి సమ్మేళనం
ఆధునిక భారతంలో యువత పాత్ర కీలకం అని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె గంగాధర రావు అన్నారు.ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో భారత ప్రభుత్వ,కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ,మై భారత్ కేంద్ర, గుంటూరు ఆధ్వర్యంలో గత శనివారం నుండి 5 రోజులు జరిగిన అంతరాష్ట్రీయ యువజన మార్పిడి సమ్మేళనం 2వ దశ లో భాగంగా గుంటూరుమై భారత్ కేంద్ర అద్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎన్ ఎస్ ఎస్ భవన్ కాన్ఫరెన్స్ హాల్ లో విజయవంతంగా ముగిసింది. ఒడిశాలోని 5 జిల్లాలైన సంబల్పూర్, బార్గర్గ్, కలహంది,బోలాన్గిర్, బాలాసోర్ జిల్లాల నుంచి 37 మంది యువతి యువకులు పాల్గొన్నారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె గంగాధర రావు మాట్లాడుతూ వివిధ అభివృద్ధి కార్యకలాపాలు,నైపుణ్య అభివృద్ధి,విద్యా ఉపాధి కలిగించే అవకాశాలపై దృష్టి సారించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంకేతిక, పారిశ్రామిక పురోగతికి యువతను ప్రోత్సహించడానికి ఇటువంటి యువ సమ్మేళనాల ద్వారా సాధ్యం అవుతుందని అన్నారు.ఈసమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు.ఐదు రోజుల పాటు జరిగిన ఈ సమ్మేళన కార్యక్రమం లో సంస్కృతి,ఉపాధి అవకాశాలు,సాంకేతికతపై పరస్పరం జ్ఞానాన్ని పంచుకోవటం ప్రాంతీయ జానపదనృత్య ప్రదర్శనలు, క్షేత్ర స్థాయి సందర్శనలు వంటి కార్యక్రమాలు జరిగాయని మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి అన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన గౌరవ వైస్ ఛాన్సెలర్కి, ప్రతి డిపార్ట్మెంట్ కు,ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ విభాగ వాలంటీర్లకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ విభాగ వాలంటీర్లు విద్యార్థిని విద్యార్థులు కూడా పాల్గొన్నారు
