ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అల్లూరి జిల్లా కార్యదర్శి దన్యంరాజు కనకరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని జీడి పంట కొనుగోలు చేయాలని కోరారు.ఉత్తరాంధ్రలో వేలాది మంది రైతులు జీడి పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు.ప్రస్తుతం మార్కెట్లో ముడి జీడి గింజ ధర కిలోకు సుమారు ₹120–₹130 మాత్రమే ఉండటంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు.రైతులు పెట్టుబడి, కూలీ ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో కనీసం కిలోకు ₹200 గిట్టుబాటు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు (ఆర్బికే ) లేదా గిరిజన సహకార సంస్థల ద్వారా నేరుగా జీడి పంటను కొనుగోలు చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో జీడి సాగు జరుగుతుండగా, ధరలు స్థిరంగా లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘాలు ఇప్పటికే పేర్కొన్నాయి.జీడి రైతులను రక్షించేందుకు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర ప్రకటించాలని ధన్యంరాజు కనకరాజు విజ్ఞప్తి చేశారు.
