Home Uncategorized ఉత్తి ఫిర్యాదు…ఊరంతా ఊరేగింపు…!

ఉత్తి ఫిర్యాదు…ఊరంతా ఊరేగింపు…!

0

` ప్రభుత్వ నర్సుల పరువు తీసిన కేజీహెచ్ యంత్రాంగం
` అవినీతి ఫిర్యాదుపై స్పందించే తీరు ఇదేనా అన్న అనుమానాలు
` మొదట్నుంచీ కక్షపూరితంగానే ఆదేశాలిస్తున్న కేజీహెచ్
` ప్రభుత్వ యంత్రాంగం తీరు చూసి నవ్వుకుంటున్న జనం

కేజీహెచ్ యంత్రాంగం డొల్లతనం మరో సారి బయటపడింది. ఫిర్యాదులపై ఎలా స్పందించాలన్నదానిపై కేజీహెచ్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు నవ్వులపాలవుతోంది. ఆకాశరామన్న ఉత్తరాలకు…అసలైన ఫిర్యాదులకు మధ్య ఉన్న తేడా గుర్తించలేరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక కుటుంబంలో ఎవరు తప్పు చేసిన ఆ గుట్టు బయటకు పొక్కకుండా ఆ కుటంబ పెద్దలు జాగ్రత్త పడుతుంటారు. ఇదే విధానం దేశంలో దేశాధినేత కూడా అమలు చేస్తుంటారు. దేశం గుట్టు బయటకు పొక్కకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంటారు. కానీ కేజీహెచ్‌లో మాత్రం అందుకు భిన్నంగా మొత్తం వ్యవస్థనే నాశనం చేసే పనిలో ఉన్నట్టు కనిపిస్తోందన్నది విశాఖ వాసుల వాదన. అందుకే కేజీహెచ్ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ నర్సుల విషయంలో వచ్చిన ఓ ఫిర్యాదు పట్ల చేసిన అతి ఇప్పుడు జిల్లా అధికార యంత్రాంగం నవ్వులపాలయ్యే పరిస్థితి తలెత్తింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ దష్టిలో పడేందుకు చేసిన హడావిడి కాస్త ఇలాంటి నకిలీ ఫిర్యాదులను కూడా హ్యాండిల్ చేయలేరా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే జోన్ 1 హెడ్ నర్సుల పదోన్నతుల పేరిట ప్రభుత్వ నర్సుల సంఘం ప్రతినిధులు గంగా భవానీ, వరలక్ష్మి, గంగా గౌరి రూ. లక్షల్లో లంచాలు తీసుకున్నారన్నది ఫిర్యాదు. ఆ ఫిర్యాదును పరిశీలిస్తే ఎవరో బ్లాక్‌మెయిలింగ్ చేసేదిగా ఉన్నట్టు ఇట్టే కనిపిస్తోంది. ఆ ఫిర్యాదులో సిటిజన్స్ ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బీవీకే బాబాజీ చేసిన సంతకాలు కూడా ఒక్కో దానిపై ఒక్కోరకంగా దర్శనమిస్తున్నాయి. ఎద్దు ఈనిందంటే…దూడను కట్టేయండ్రా….! అన్న సామెత మాదిరిగా ఫిర్యాదు రావడం పాపం….క్షణాల్లో విచారణకు ఆదేశాలు జారీ అయిపోయాయి. ప్రభుత్వ నర్సుల సంఘంపై ఆరోపణలొస్తే…వారిని విచారించాలి గానీ…ఎఫ్ ఆర్ ఎస్ తీసుకురండి…ఆ చిట్టాలు తీసుకురండి…ఈ రశీదులు తెండి అంటూ పితలాటకం వెనుక మతలబు ఏంటో ప్రభుత్వ ఉద్యోగులకే అంతుచిక్కడం లేదు. అవినీతి చేసిన లెక్కలేమైనా రశీదుల్లోనూ…ఎఫఆరఎస్‌లలో కనిపిస్తాయా అన్నది విచారణ చేసిన…విచారణకు ఆదేశాలిచ్చిన ఆ మహానుభావులకే తెలియాలని జిల్లా ఉద్యోగులు నవ్వుకుంటున్నారు.

విచారణకు హాజరైన ప్రభుత్వ నర్సుల సంఘం…!

ప్రభుత్వ నర్సుల సంఘంపై సిటిజన్స్ ఫోరం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీవీకే బాబాజీ, లక్ష్మీ శేషాద్రి చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం బుల్లయ్యకాలేజీ ఎదురుగా ఉన్న ఆర్టీసీ మేల్ ప్రిన్సిపల్ డాక్టర్ మీనాక్షి విచారణ చేపట్టారు. ఈ విచారణకు ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవానీ, కార్యదర్శి జీవీఎస్ వరలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు గంగా గౌరి తో పాటు హెడ్ నర్సులు 39 మంది విచారణకు హాజరయ్యారు. అయితే ఫిర్యాదు దారు బాబాజీ, ఆయన తరపు ప్రతినిధి లక్ష్మీ శేషాద్రి ఈ విచారణకు గైర్హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరీక్షించినా వారి జాడ లేదు. అయితే విచారణ అధికారులు తమను అడిగిన మొత్తం వివరాలను అందించామని, రికార్డులను కూడా అందించామని, తామెలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పినట్టు ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గంగా భవానీ, వరలక్ష్మి తెలిపారు. హెడ్ నర్సుల నుంచి పదోన్నతుల కోసం ఫోరం ఆరోపించినట్టుగా మేము ఎలాంటి నగదు లావాదేవీలు చేపట్టలేదని వెల్లడించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version