బ్రహ్మశ్రీ హరినాథ శర్మ, పంచాంగ నిపుణులు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి, ఆర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, దాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు రాజాది నవనాయకులలో ఏడుగురు శుభాన్నిచ్చేవారు కావడం వల్ల దేశము సుభిక్షమై సమస్త జీవరాశులు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని, దేశం అన్నపూర్ణగా విరాజిల్లుతుందని, పశుపాలకుడు, గోష్టాగార ప్రాపకుడు, గోష్ఠాద్భహిష్కర్త శ్రీకృష్ణుడే అవడం వల్ల దేశం సుభిక్షంగా సస్య వృద్ధి, పాడిపంటల సమృద్ధి, ప్రజలకు క్షేమారోగ్యములు కలుగనున్నాయని ప్రముఖ పంచాంగ నిపుణులు బ్రహ్మశ్రీ నంద్యాల హరినాథ శర్మ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో కర్నూలు నగరం, నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని శ్రీ భరతమాత మందిరం నందు ఏర్పాటుచేసిన పంచాంగ పఠన కార్యక్రమంలో వారు ద్వాదశ రాశుల వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలను వివరించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరానికి కేతువు అధిపతి అయిన కారణంగా ప్రజలలో తీర్థయాత్రలు చేయడం, ధార్మిక కార్యక్రమాలలో అధికంగా పాల్గొనడం, వేదాంత విచారణ, దైవంపట్ల భక్తి, జ్ఞానం, వైరాగ్యాలు పెరుగుతాయని వివరించారు. దేశ పాలకుడు ఆస్తికుడైన కారణంగా ఈ దేశానికి ఎటువంటి ఒడిదుడుకులు ఉండవని, దేశానికి సమున్నతమైన గౌరవం పెరుగుతుందని, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని, స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉంటుందని, రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, ఆలయ అర్చకులు కొండమడుగు భరద్వాజ శర్మ, విష్ణు సహస్రనామ పారాయణ బృందం అధ్యక్షులు మల్లెల పెద్ద పుల్లారెడ్డి, ఆలయ ఉపాద్యక్షులు ఎస్. వి. నారాయణ రెడ్డి, ఆలయ సహకార దర్శులు ఎన్.చంద్ర రెడ్డి, వై.లావణ్య, సభ్యులు వై.శంకర్ రెడ్డి, పి. పద్మావతి, ఎస్.శంకుంతల, వసుంధరమ్మ, సి. రామసుబ్బమ్మ, ఎస్. శకుంతల, టి. పద్మా, జి. తులసమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
