నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేశారు. అనంతరం భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
వేడుకలలో భాగంగా పార్టీలో విశిష్ట సేవలు అందించిన సీనియర్ నాయకులను శాలువాలు కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పట్టణ, మండల, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
