ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైకాపా నాయకుడు అంబటి రాంబాబుపై తగు చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకట రమణ చౌదరితో కలిసి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. డీఎస్పీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేసి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల్లో అసహనం కలిగిస్తున్నాయని, రాజకీయ మర్యాదను దాటుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, లీగల్ సెల్ సభ్యులు తదితరులు పాల్గొని, అంబటి రాంబాబుపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
