బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం రాజమహేంద్రవరం మంజీరా హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అయితే నిజం ఎప్పటికైనా ప్రజల ముందుకు వస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.
ఇంతకు ముందు కూడా తనపై పలు సందర్భాల్లో దుష్ప్రచారం జరిగిందని, అయితే ప్రతిసారీ ప్రజలు నిజాన్ని గుర్తించి తనకు అండగా నిలిచారని చెప్పారు. ఎటువంటి ఆధారాలు లేని, ఆశామాషీ సమాచారం ఆధారంగా జరుగుతున్న ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను మాట్లాడే ప్రతి విషయం పూర్తి సమాచారం, నిర్ధారణ తరువాతే ప్రజల ముందుకు తీసుకొస్తానని స్పష్టం చేశారు.
కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలే తన నిజాయితీకి సాక్ష్యమని కంబాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. వితంతువులు, దివ్యాంగులు, పేద కుటుంబాలకు అందిస్తున్న సహాయం, అన్ని మతాల వారిని కలుపుకుంటూ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు తన పనితీరుకు నిదర్శనమన్నారు.దుష్ప్రచారాలతో తాను వెనక్కి తగ్గబోనని, ప్రజల ఆశీస్సులతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని చెప్పారు. చివరగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నవీన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి కొనసాగిస్తానని కంబాల శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
