హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీ మూకలు కలిసి చేసిన దాడిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి గూండాగిరీ చర్యలకు ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పత్రిక ప్రకటనను విడుదల చేస్తూ హైదరాబాదులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చెయ్యడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
మీడియాపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే స్వయంగా రౌడీ మూకలను వెంట తీసుకెళ్లి దాడులకు దిగడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గత ఐదేళ్లుగా ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ధైర్యంగా నిలబడి ప్రజలకు నిజాలను తెలియజేస్తున్నారని ప్రశంసించారు. అమరావతి అంశంపై వైసీపీ చేస్తున్న చర్యలను ఆధారాలతో ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక దాడులకు దిగడం వారి పిరికిపంద వైఖరికి నిదర్శనం అని విమర్శించారు
