మాడుగుల ఏరియా పశు వైద్యశాలలో గురువారం పశు వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 150 రూపాయలకే లింగ నిర్ధారిత వీర్యం ( ఆడ పెయ్యలు పుట్టే ఇంజెక్షన్ ) గురించి మండలంలోని అన్నీ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న పాడి రైతులకు అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా చూడాలని సూచించారు.
అలాగే ఈ నెల 27 నుండి మార్చి 13 వరకు గొర్రెలు, మేకలకు పి.పి.ఆర్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించాలని, మార్చి నెలాఖరుకు ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. దానికనుగుణంగా తమ ప్రణాళిక ప్రకారం పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వి. మాడుగుల ఏరియా పశు వైద్య శాల సహాయ సంచాలకులు డా. వి. చిట్టి నాయుడు, కింతలి వల్లాపురం, పెదగోగాడ, చీడికాడ పశు వైద్యాధికారులు డా. రాఘవమ్మ, డా. మణి లక్ష్మణ్, డా. శివ కుమార్, పారా సిబ్బంది మేరీ రత్నం, ప్రసాద్, సంతోష్, సంతోష్ కుమార్, నానిబాబు, పశు సంవర్ధక సహాయకులు గోపాలమిత్రలు పాల్గొన్నారు.
