గ్రామీణ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది.గ్యాస్ కొరత లేదు.ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు అంటూ ఓవైపు ప్రజాప్రతినిధులు,అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.సరఫరాలో జాప్యం వల్ల వినియోగదారులు ఏజెన్సీ డెలివరీ పాయింట్ల వద్ద బారులు తీరుతున్నారు.సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కావడానికి వారాల సమయం పడుతోంది.చోడవరం హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు శనివారం వడ్డాదిలో గ్యాస్ డెలివరీ చేశారు.ఈనెల 19వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే శనివారం గ్యాస్ పంపిణీ చేశారు.గ్యాస్ కోసం వినియోగదారులు క్యూ కట్టారు.ఎండలు మండుతున్నా గ్యాస్ బండ కోసం గంటలు తరబడి క్యూలో నిరీక్షించారు.తప్పనిసరి పరిస్థితుల్లో మండుటెండలో పడిగాపులు కాయాల్సి వస్తుందని వినియోగదారులు తెలిపారు.పోలీస్ పహారా నడుమ వినియోగదారులకు గ్యాస్ పంపిణీ చేశారు.
