తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. రోగులకు సేవలు అందించాల్సిన సమయంలో కొందరు నర్సింగ్ సిబ్బంది విధులను పక్కనబెట్టి ఆసుపత్రి ఆఫీస్ గదిలోనే ఐటెం సాంగ్స్కు చిందులు వేస్తూ అశ్లీల నృత్యాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. రోగుల సేవలను నిర్లక్ష్యం చేసి ఈ విధంగా ప్రవర్తించడం అత్యంత బాధ్యతారాహిత్యమని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన వైద్యారోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా డ్యాన్స్ చేసిన హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరిలను తక్షణమే సస్పెండ్ చేశారు. అలాగే ఈ ఘటనలో పాల్గొన్న మరో 16 మంది నర్సింగ్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల సేవలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయంలో ఇలాంటి వ్యవహారం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. విచారణ అనంతరం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
