రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మున్సిధపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళా మున్సిపల్ కార్మికులు సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
ఈ దీక్షలను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం. సుందర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించడం, కరువు భత్యం, మధ్యంతర భృతి అమలు చేయాలని, ఇంజినీరింగ్ కార్మికులకు టెక్నికల్ జీతాలు ఇవ్వాలని కోరారు.
అలాగే పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ సౌకర్యాలు కల్పించాలని, రిటైర్ అయిన లేదా మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మున్సిపల్ కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని కూడా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు భూపతి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి పూజారి వాసు ఆధ్వర్యంలో మీసాల శివశంకర్, జ్యోతి, అల్లం వెంకటలక్ష్మి, సంగం రెడ్డి వెంకటరమణ, వరలక్ష్మి, కారంకి తిరుమల, కవల వెంకటలక్ష్మి, బోలా చిట్టెమ్మ, చెన్నా కామేశ్వరి తదితర మహిళా కార్మికులు పాల్గొన్నారు.
