మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరి తీరంలోని మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతోనే ఊహించినదానికంటే అధిక సంఖ్యలో భక్తులు మహాశివరాత్రి వేడుకలకు తరలివచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎండోమెంట్ కమిటీలు, స్థానిక నాయకత్వం సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతమైన సేవలు అందిస్తున్నాయని అభినందించారు.
పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ట్రయల్ రన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఘాట్ వద్ద భక్తులు ఎన్ని నిమిషాల్లో స్నానం చేసి బయటకు వస్తున్నారన్నది పర్యవేక్షించే విధంగా ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ అమలు చేశామని చెప్పారు. చిన్నపిల్లలు తప్పిపోతే వెంటనే గుర్తించేందుకు స్కాన్ చేయగల ట్యాగ్లు అందించామని, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని వివరించారు. ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నారు.
అలాగే శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, సారంగాధరేశ్వర స్వామి ఆలయాల్లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. టినగర్, కాస్మోపాలిటన్ క్లబ్ సమీపం, లింగంపేట, మూలగొయ్యి సెంటర్, చింతాలమ్మ ఘాట్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. దేవీచౌక్లో జరిగిన పసుపు కుంకుమ వేడుకలోనూ హాజరయ్యారు.
సనాతన ధర్మాన్ని కాపాడుతుందన్న నమ్మకంతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, ఇందుకు తోడ్పడిన కమిటీలకు, నాయకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
