ఈనెల 5వ తేదీ గుంటూరులోని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్వగృహంలో జరిగిన 64వ జన్మదిన కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి లతోపాటు బత్తినేని కోటేశ్వరరావు, రమావత్ హనుమాన్ నాయక్, మానవత సభ్యులు శివాజీ పాల్గొని శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ డొక్కా మాణిక్య వరప్రసాద్ విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వారని, శాసనసభ్యునిగా, శాసనమండలి సభ్యునిగా మరియు ఉన్నత విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గా కృషి చేశారని తెలిపారు. గుర్రం జాషువా సాహిత్యాన్ని దశాబ్ద కాలంగా తెలుగు ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రజలను జాగృతులను చేస్తున్నారన్నారు . దళిత సామాజిక వర్గ సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నారన్నారు . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీజీల భావాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ఆలోచింప చేస్తున్నారన్ని తెలిపారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని సామాజిక సమస్యలపై ఉద్యమించాలని, మంచి రాజకీయవేత్త గా ఎదగాలని జన చైతన్య వేదిక భావిస్తుందని పేర్కొన్నారు.
