ఇది శక్తి ప్రదర్శన మాత్రమే కాదు
– ఐ ఎఫ్ ఆర్ లో పాల్గోవడం గర్వంతో పాటు ఆనందాన్నిస్తోంది
– సురక్షిత సముద్రం-సమృద్ది భారత్ లక్ష్యమే నౌకాదళం
– ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటే కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదని, ఇది అంతర్జాతీయ స్నేహ బంధాలకు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహా విశాఖలో బుధవారం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ముగిసిన అనంతరం ఆమె ప్రసంగించారు. విశాఖ అనే సముద్ర తీర మహా నగరంలో ఈ గౌరవప్రదమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడం నాకు అపారమైన గర్వాన్ని, ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ దేశం ఒక సముద్ర వారసత్వం కలిగిన దేశమని, శతాబ్దాలుగా మన సముద్ర మార్గాలు వాణిజ్యానికి, సంస్కృతి, భద్రతకు ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయన్నారు. ఈ రోజు మన ముందున్న ఈ విశాల నౌకాదళ విన్యాసం భారత నౌకాదళ శక్తి, సాంకేతిక నైపుణ్యం, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భారత నౌకాదళం దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడమే కాకుండా సముద్ర మార్గాల భద్రత, మానవతా సహాయ కార్యక్రమాలు, విపత్తు సహాయక చర్యల్లోనూ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. సురక్షిత సముద్రం-సమృద్ది భారత్ అనే లక్ష్యంతో మన నౌకాదళం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. వివిధ దేశాల నౌకాదళాలు ఐ ఎఫ్ ఆర్ లో పాల్గొనడం ద్వారా “వసుధైవ కుటుంబం” అనే భారతీయ తత్వాన్ని మనం ఆచరణలో చూపిస్తున్నామని పేర్కొన్నారు. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సముద్ర దోపిడీ నియంత్రణ వంటి అంశాలలో అంతర్జాతీయ సహకారం అత్యవసరమని,
మన యువతకు, ముఖ్యంగా విశాఖపట్నం వంటి తీరప్రాంతాల్లో పెరుగుతున్న విద్యార్థులకు, భారత నౌకాదళం స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు. క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం – ఇవే మన నావికుల విశేష లక్షణాలని,
ఈ సందర్భంగా దేశ సేవలో అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి నౌకాదళ సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని, వారి కుటుంబాలకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ సముద్ర శక్తి మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి, భద్రత, సహకారం కోసం మన దేశం ముందంజలో నిలవాలని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నానన్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో వివిధ దేశాలకు చెందిన 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నేవల్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
