తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామంలోని ప్రసిద్ధ మరగంటి రామాలయం వద్ద శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో శ్రీ రామ రక్షాస్తోత్ర పారాయణం ఘనంగా నిర్వహించారు. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాస శుక్లపక్ష చతుర్ధశను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సహస్రనామ తులసి అర్చనతో పాటు అన్నవరం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో రామ రక్షాస్తోత్ర పారాయణం సాగింది.
కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అర్చకులు, బ్రాహ్మణులు ఆయనకు పూర్ణకలశంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 మంది బ్రాహ్మణులు వేదమంత్రాలతో ఆశీర్వదించి సత్కరించారు. ధార్మిక కార్యక్రమాల ప్రాధాన్యతను వివరిస్తూ బ్రాహ్మణులకు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచింది.
