Home News పక్క రాష్ట్రాల్లో గూగుల్ ప్రకంపనలు: గంటా

పక్క రాష్ట్రాల్లో గూగుల్ ప్రకంపనలు: గంటా

0

విశాఖపట్నం, జయ జయహే: విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ఖరారు చేయడం పొరుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రుషికొండ ఐటీ సెజ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఐటీలో ప్రముఖ స్థానంలో ఉన్న కర్ణాటకను.. గూగుల్ సీఈవో సుందర్ పిచ్చయ్ సొంత రాష్ట్రమైన తమిళనాడును కాదని రూ.1.3 లక్షల కోట్ల డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కావడం పట్ల దేశ వ్యాప్త చర్చ జరుగుతోందని చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో గూగుల్ డేటా సెంటర్ ప్రతిపక్షాలకు ప్రధానాంశం కానుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ను ఖరారు చేయించి విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన సీఎం చంద్రబాబుకు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనుభవమున్న విజనరీ లీడర్ కు.. యువ నాయకత్వం తోడవడంతో జెట్ స్పీడ్ వేగంతో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో మటన్ మాల్స్, ఫిష్ సెంటర్లు, పచ్చళ్ల వ్యాలీలు, మామిడి తాండ్ర జోన్లు, అప్పడాల హబ్ లు, మసాల ఉత్పత్తుల కారిడార్ లు ఏర్పాటు చేస్తే.. 16 నెలల కూటమి హయాంలో గూగుల్, క్వాంటమ్ వ్యాలీ, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ వంటి అంతర్జాతీయ సంస్థలను తెచ్చామని పేర్కొన్నారు. అసమర్థ పరిపాలనకు.. సమర్ధమైన నాయకత్వానికి మధ్య తేడా ప్రజలు గమనించాలని కోరారు. విశాఖలో ఏర్పాటు కానున్న ఐటీ సంస్థలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించి.. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు లోకేష్ సూచించారన్నారు. సీఐఐ సమ్మిట్ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం చరిత్రగా అభివర్ణించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version