Home News రాజమహేంద్రవరం నగరంలో ఆహార భద్రతా శాఖ విస్తృత తనిఖీలు

రాజమహేంద్రవరం నగరంలో ఆహార భద్రతా శాఖ విస్తృత తనిఖీలు

0

30 యూనిట్ల పరిశీలన – 174 కేజీల కుళ్ళిన, కల్తీ ఆహార పదార్థాలు సీజ్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం నగరంలో బుధవారం ఆహార భద్రతా అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. మొత్తం 10 మంది అధికారులు, ఇన్స్పెక్టర్లు 5 బృందాలుగా ఏర్పడి నగరంలోని సుమారు 30 ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, స్వీట్ షాపులు, స్వీట్ తయారీ కేంద్రాలు, బేకరీలను పరిశీలించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 కింద పలు ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు.
మొత్తం 20 ఆహార పదార్థాల నమూనాలను స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, హైదరాబాద్‌కు పంపించారు. చికెన్ బిర్యానీలు, చికెన్ ఫ్రై, వంట నూనెలు, స్వీట్లలో కృత్రిమ రంగుల వినియోగంపై అనుమానంతో శాంపిళ్లు సేకరించారు.
కుళ్ళిపోయిన మాంసం, మసాలా పేస్టులు, వండి నిల్వ ఉంచిన మాంసాహార పదార్థాలను సీజ్ చేసి ధ్వంసం చేశారు. సుమారు 174 కేజీల ఆహార పదార్థాలు (రూ.62 వేల విలువ) వినియోగానికి అనర్హమని గుర్తించి నిర్వీర్యం చేశారు. అలాగే గడువు ముగిసిన ఆహార పదార్థాలు, నిషేధిత రంగులు, పాడైన గుడ్లు, న్యూస్ పేపర్లతో తయారు చేసిన బ్రెడ్, కేక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఫుడ్ సాంపిళ్ల నివేదికలు వచ్చిన అనంతరం సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version