సమన్వయంతో పని చేయాలి
మంత్రులు, అధికారులు కలసి ముందుకెళ్లాలి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు
కేబినెట్ మినిస్టర్లకు కీలక దిశానిర్దేశం
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు చేరేలా మంత్రులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏడాది పొడవునా ప్రజల్లో తిరిగి చేసే సేవలను అసెంబ్లీలో ఒకరోజు సమర్థంగా వివరించగలిగితే, అది ప్రతి ఇంటికీ చేరినట్లే అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి రోజూ ఒక పరీక్షలాంటిదని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అసెంబ్లీలో తమ శాఖలపై పూర్తి అవగాహనతో సమాధానాలు ఇవ్వాలని, స్టేట్మెంట్లు స్పష్టంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. శాఖలపై మరింత పట్టు సాధించి ప్రజలకు సరిగ్గా వివరించాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. వికలాంగుల ధ్రువపత్రాలు కలిగిన వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఈ నెల 28న సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజు అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా రాజకీయాలకే పరిమితమవుతోందని సీఎం విమర్శించారు. అసెంబ్లీ చర్చలు అర్థవంతంగా ఉండాలని, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శ్రీకాకుళంలో డయేరియా కేసులు, రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనలకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని హెచ్చరించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో విశ్లేషిస్తున్నామని సీఎం వెల్లడించారు. అసెంబ్లీలో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో, ప్రజలకు ఎంత ఉపయోగపడుతున్నారో పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, అంతా సమర్థవంతంగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.
