బెంగళూరు–రాజమండ్రి డ్రగ్ ముఠా అరెస్ట్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో డ్రగ్ మోత్ కలకలం సృష్టించింది. కొవ్వూరు గ్రామన్ సమీపంలోని దొమ్మేరు వెళ్లే బ్రిడ్జి అండర్పాస్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బెంగళూరు నుంచి రాజమండ్రికి డ్రగ్ తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. టీఎస్ 08ఎఫ్ వై5598 నంబరు గల కారును తనిఖీ చేయగా, అందులో 18.15 గ్రాముల మోత్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వివరాలను సోమవారం కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్ వెల్లడించారు. అరెస్టయిన వారిని విచారించగా, రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల కాలేజీ విద్యార్థులే ప్రధాన లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. డ్రగ్స్కు బానిసలైన వీరే డబ్బుల కోసం బెంగళూరు నుంచి మోత్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠాలో విశాఖపట్నానికి చెందిన ఒక యువతి కూడా ఉండటం గమనార్హం. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పట్టణ సీఐ విశ్వం సహా పోలీసు సిబ్బందిని డీఎస్పీ జి. దేవకుమార్ అభినందించారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు.
