అభినందించిన ప్రభుత్వ నర్సుల సంఘం
ఏపీ వైద్య మండలి సభ్యురాలిగా విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 పోస్టుల కోసం దాదాపు 84 మంది సీనియర్ వైద్యులు పోటీపడినప్పటికీ విశాఖకు చెందిన డాక్టర్ వాణి ఆరో స్థానంలో విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గంగా భవానీ, వరలక్ష్మి ఇతర కార్యవర్గ సభ్యులంతా గురువారం సూపరింటెండెంట్ వాణిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. 20 ఏళ్ల తర్వాత జరిగిన వైద్య మండలి ఎన్నికల్లో విశాఖ నుంచి ఓ మహిళ ప్రాతినిధ్యం వహించడం అభినందనీయమని గంగా భవానీ కొనియాడారు. డాక్టర్స్ డెమోక్రటిక్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన 9 మందిలో డాక్టర్ వాణి విజయం సాధించడం విశాఖకు గర్వకారణంగా పేర్కొన్నారు. ఏపీ వైద్య మండలిలో విశాఖ నుంచి అడుగుపెట్టిన డాక్టర్ వాణి భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని కోరారు.
