Home Politics Andhra Pradesh ఏపీఈపీడీసీఎల్‌కు రూ. 27.76 కోట్ల కేంద్ర ప్రోత్సాహకం

ఏపీఈపీడీసీఎల్‌కు రూ. 27.76 కోట్ల కేంద్ర ప్రోత్సాహకం

0

– సూర్య ఘర్ పధకం ద్వారా 148.7 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు
* రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు లో విశేష ప్రగతికి జాతీయ స్థాయి గుర్తింపు
– ఏపీఈపీడీసీఎల్ సీఎండి పృథ్వీతేజ్ ఇమ్మడి, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్‌టాప్ సౌర ప్లాంట్ల ఏర్పాటులో విశేష పురోగతి సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కు కేంద్ర ప్రభుత్వం రూ. 27.76 కోట్ల ప్రోత్సాహకాన్ని మంజూరు చేసినట్లు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ), భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 విద్యుత్ పంపిణీ సంస్థలకు కలిపి రూ. 1,422 కోట్లకు పైగా ప్రోత్సాహకాలు విడుదల చేయగా, అందులో ఏపీఈపీడీసీఎల్ ఒక ప్రధాన లబ్ధిదారుగా నిలిచిందని తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన ఎంఎస్ఈడీసీఎల్ , గుజరాత్ కు చెందిన పీజీవీసీఎల్, యూజీవీసీఎల్, డీజీవీసీఎల్, ఎంజీవీసీఎల్, టాటా పవర్-ఢిల్లీ, టీపీఎల్- అహ్మదాబాద్, టీపీఎల్- సూరత్, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, టీజీఎన్పీడీసీఎల్, జేవీవీఎన్ఎల్- జైపూర్, నోయిడా పవర్ కంపెనీ లిమిటెడ్ సంస్థలకు ప్రోత్సాహకాలు లభించాయన్నారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో గృహ వినియోగదారుల వద్ద రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల స్థాపనలో గణనీయమైన వృద్ధి నమోదవడం వల్లే ఈ ప్రోత్సాహకం లభించిందని తెలిపారు. ఇప్పటివరకు 46,603 మంది గృహ వినియోగదారులకు 148.7 మెగావాట్ల సామర్ధ్యంతో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసామన్నారు. ఈ ప్రోత్సాహక నిధులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని మరింతగా పెంపొందించడంలో, వినియోగదారులకు నాణ్యమైన మరియు తక్కువ వ్యయంతో విద్యుత్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. సంస్థ పరిధిలో మరిన్ని గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అమలులో ఏపీఈపీడీసీఎల్ సమర్థవంతంగా పనిచేసి ఈ కేంద్ర ప్రోత్సాహకాన్ని సాధించడం సంస్థకు గర్వకారణమన్నారు. రాష్ట్రంలో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల విస్తరణను మరింత వేగవంతం చేస్తూ, వినియోగదారులకు పారదర్శకమైన, సులభమైన సేవలను అందించడానికి సంస్థ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందిస్తూ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ దిశగా ముందుకు తీసుకెళ్లడమే ఏపీఈపీడీసీఎల్ లక్ష్యమని సీఎండి తెలిపారు.
ఈ సందర్బంగా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటులో అనుకున్న లక్ష్యాలను సాధించడంలో సహకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఎంఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఏడిసిఏపి అధికారులకు, వినియోగదారులకు సీఎండి పృథ్వీతేజ్ కృతజ్ఞతలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version