సమీక్షలో గంటా సూచన
భీమిలి నూకాలమ్మ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. ఉత్సవ ఏర్పాట్లపై భీమిలి క్యాంప్ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. విరాళాలిచ్చే దాతలకు దర్శనాల్లో ఇచ్చే వెసులుబాటు సామాన్య భక్తులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పారు. పార్కింగ్.. ట్రాఫిక్ తదితర అంశాల్లో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంచినీరు, మొబైల్ టాయ్ లెట్లు, పారిశుద్ధ్య పరంగా తీసుకుంటున్న చర్యలను జోనల్ కమిషనర్ ఎం. విజయ్ కుమార్ వివరించారు. భక్తులకిచ్చే పులిహోర, లడ్డు ప్రసాదాలను గత ఏడాది కంటే అధికంగా పంపిణీ చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఉత్సవ వినోద కార్యక్రమాలు ప్రదర్శించే సమయాన్ని రాత్రి 1 వరకూ పెంచాలన్నారు. ఉత్సవ ఆదాయంలో కొంత భాగాన్ని నిర్వహణ కోసం దేవాదాయ శాఖ కమిటీకి అందించాలని కోరారు. సంప్రదాయ వ్యవహారాలను కమిటీ చూసుకుంటే.. ఏర్పాట్ల విషయాలను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుందని గంటా పేర్కొన్నారు. వేట్లపాలెం దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని బాణాసంచా కాల్చడంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సంగీత్ మాధుర్, ఏసీపీ అప్పలరాజు, ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింహాచలం నాయుడు, కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి, నాయకులు చిక్కాల విజయ్ బాబు, గంటా నూకరాజు, షణ్ముఖరావు, కరుణాకర్ రెడ్డి, తమ్మిన సూరిబాబు, గాడు యశ్వంత్, గొలగాని నరేంద్ర, కింగ్, పాసి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
