నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందొర
రాజమహేంద్రవరం/నిడదవోలు , జయజయహే ప్రతినిధి: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందొర డిమాండ్ చేశారు. నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి పథకం ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకు మహత్తర లక్ష్యంతో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందన్నారు. వలసలు తగ్గించి గ్రామాల్లోనే ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసిన 90 శాతం నిధులను 60 శాతానికి పరిమితం చేస్తామని చెప్పడం పథకానికి తూట్లు పొడవడమేనని భద్రందొర విమర్శించారు. మహాత్మా గాంధీ పేరుతో కొనసాగుతున్న పథకానికి పేరు మార్చే ప్రయత్నాలు చేయడం గాంధీజీని అవమానించడమేనని అన్నారు. మహాత్మా గాంధీని భౌతికంగా గాడ్సే హత్య చేసినట్లే, ఇప్పుడు ఆయన ఆలోచనలను దెబ్బతీయడం ద్వారా మానసికంగా హత్య చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ రెడ్డి ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారని తెలిపారు. అవసరమైతే ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్నం మురళీకృష్ణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బషీర్, జిల్లా ఎస్.టి. విభాగం అధ్యక్షుడు బండి అభిశక్తుడు తదితరులు పాల్గొన్నారు.
