రూ.26 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ విమెన్స్ హాస్టల్ కు శంకుస్థాపన చేసిన గంటా ,మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శివశక్తినగర్ లో రూ. 26.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వర్కింగ్ విమెన్స్ హాస్టల్ భవనానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 1.46 ఎకరాల్లో అధునాతన వసతులతో నిర్మిస్తున్న హాస్టల్ భవనాన్ని
నాణ్యత ప్రమాణాలతో 18 నెలల్లో గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎస్ఏఎస్సీఐ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.172 కోట్లతో మధురవాడ సహా గాజువాక, ముడసర్లోవలో వర్కింగ్ విమెన్స్ హాస్టల్ భవనాలను నిర్మిస్తున్నట్టు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పనులు వెల్లువలా జరుగుతున్నాయని, భీమిలి నియోజకవర్గంలోని 9 జీవీఎంసీ వార్డుల్లో రూ.250 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. వార్డుల నుంచి ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులను ఆమోదించాలని కమిషనర్ ను కోరారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మధురవాడ ప్రాంతంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఊపిరి పోసుకుంటున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణరాజు, జోనల్ కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, కార్పొరేటర్లు మొల్లి హేమలత, లొడగల అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, మొల్లి లక్ష్మణరావు, మాన్యాల సోంబాబు, నాగోతి సత్యనారాయణ, వాండ్రాసి అప్పలరాజు, అచ్యుతరావు, మామిడి దుర్గారావు, బోయి రమాదేవి, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
– 7 వ వార్డులో రూ.3.63 కోట్లతో అభివృద్ధి పనులు
జీవీఎంసీ 7 వ వార్డు పరిధిలో రూ. 3.63 కోట్లతో ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. నగరంపాలెం ముత్యాలమ్మ ఆలయం వద్ద రూ. 50 లక్షలతో రోడ్డు.. మొగదారమ్మ కాలనీలో రూ. 50 లక్షలతో మరో రోడ్డు నిర్మిస్తున్నారు. ఆర్టీసీ కాలనీ పార్కు, కళానగర్ పార్కులకు చుట్టూ ప్రహరీ నిర్మాణంతో పాటు పార్కు లోపల వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 48 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఎన్.జి.ఓ. కాలనీలో.. వాంబే కాలనీలో.. ఒక్కొకటి రూ. 49 లక్షలతో సీసీ డ్రెయిన్లు, కల్వర్టులను నిర్మిస్తున్నారు. మిథిలాపురి ఉడా కాలనీ, బింద్రా నగర్, కృష్ణా నగర్ లలో ఒక్కొక్కటి రూ.19 లక్షలతో డ్రెయిన్లు, కల్వర్టులు ప్రతిపాదించినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతిరాజు, కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, పిల్లా వెంకట్రావు, కె. అచ్యుతరావు, తదితరులు పాల్గొన్నారు.
