తిరుమల సహా ఆలయాల మూసివేత
నేటి నుంచి భక్తులకు దర్శనాలు
చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ఆలయాలను మూసివేశారు. తిరుమల వేంకటేశ్వరుని ఆలయాన్ని టీటీడీ అధికారులు ఉదయం 9 గంటలకు మూసివేశారు. గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులకు తాళాలు వేశారు. తిరుమల అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ కూడా నిలిపేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా 40 వేల పులిహోర పొట్లాలు పంపిణీ చేశారు. సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు చంద్రగ్రహణం ముగిశాక ఆలయంలో శుధ్ధి, పుణ్యాహవచనం కార్యక్రమం నిర్వహించి తర్వాత దర్శనాలకు అనుమతిస్తారు. తిరిగి బుధవారం సర్వదర్శన టోకెన్లు జారీని ప్రారంభిస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.ఇవాళ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ, ఆర్జిత సేవల టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీని ఇప్పటికే ఆపేసింది. తిరిగి రేపు సర్వదర్శన టోకెన్లు జారీని ప్రారంభించనుంది. చంద్రగ్రహణ ప్రభావంతో తిరుపతిలోని స్థానిక ఆలయాలు మూతపడ్డాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలను అధికారులు మూసివేశారు. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాల్లోనూ దర్శనాలు నిలిపివేశారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయాల తలుపులు తెరిచి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిని అధికారులు మూసివేశారు. ఆలయంలో అమ్మవారికి నివేదన అనంతరం ప్రధానాలయంతో పాటు ఉపాలయాలకు ఆలయ అర్చకులు, సిబ్బంది తాళాలు వేశారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో శీనానాయక్, దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ సమక్షంలో కవాట బంధనం చేశారు. రేపు తెల్లవారుజామున మూడు గంటలకు గ్రహణ మోక్షకాలం అనంతరం ఆలయ ద్వారాలను తెరిచి దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
