బైక్లపై వెళ్లిన ఎంపీ శ్రీ భరత్, వీఎంఆర్డీఏ ఛైర్మన్, కమిషనర్లు
భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుసంధానించే ప్రధాన రహదారుల నిర్మాణ పనులను విశాఖ ఎంపీ శ్రీ భరత్, వీఎంఆర్డిఏ ఛైౖర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్, తదితరులు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గురువారం అడవివరం కూడలి నుంచి జరుగుతున్న అభివృద్ధి పనులను, రహదారి నిర్మాణ నాణ్యతను కూడా పరిశీలించారు. అక్కడ నుంచి ద్విచక్ర వాహనాల పై ప్రయాణం చేసి రాకపోకలకు అనువుగా ఉందా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ రహదారి నుంచి జాతీయ రహదారికి చేరుకునే మార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ సీఎం సూచనలు మేరకు భోగాపురం ఎయిర్ పోర్టు కార్యకలాపాలు ప్రారంభించే నాటికి అనుసంధాన రహదారులు నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ 7 ప్రధాన రహదారులను జూన్ మొదటి వారం నాటికి పూర్తి చేస్తామని, తిమ్మాపురం మారికవలస రహదారి ఇప్పటికే పూర్తి చేయటం జరిగిందన్నారు. అడవివరం నుంచి శొంఠ్యాం రహదారి 42 శాతం పనులు పూర్తి అయ్యాయని, అటవీ శాఖ భూములు ఉండటంతో పనులు కాస్త ఆలస్యమవుతున్నాయని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో సాధ్యమైనంత త్వరగా మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు. మిగిలిన రహదారుల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నేరేళ్లవలస-కొత్తవలస రహదారి పనులు ఇప్పటికీ 62 శాతం పూర్తి చేసుకున్నామని, బోయపాలెం – కాపులుప్పాడ రహదారి పనులు 66 శాతం, వేపగుంట, పినగాడి రహదారి పనులు ఇప్పటికీ 35 శాతం పూర్తి అయ్యాయన్నారు.ఈ రహదార్లు నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. విమానాశ్రయానికి వెళ్ళే ప్రయాణికులు రాకపోకలు అనువుగా ఉండేలా ఎట్టి పరిస్థితుల్లో విమానాశ్రయ ప్రారంభంనాటికి రహదారులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని, రహదారి నిర్మాణంలో ప్రభావితమైన కట్టడాలకు పరిహారం కూడా చెల్లించడం జరిగిందన్నారు. గంభీరం వద్ద మేజర్ బ్రిడ్జి నిర్మాణానికి కొంత సమయం పడుతుందని, మిగిలిన రహదారి పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజనీర్ దుర్గా ప్రసాద్, ఉప కార్యనిర్వహక ఇంజనీర్లు రవిశంకర్, విశ్వనాథ్, రెడ్డి గుత్తేదారు తదితరులు పాల్గొన్నారు.
