ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక డెస్టినేషన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పర్యాటక రంగాన్ని కేంద్రబిందువుగా చేసుకొని పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు.
గత 18 నెలల్లో పర్యాటక రంగంలో రూ.36 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, 117 సంస్థలతో పెట్టుబడి ఒప్పందాలు కుదిరినట్లు మంత్రి వివరించారు. ఈ పెట్టుబడుల ద్వారా లక్షా 22 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.428 కోట్ల పెట్టుబడులు కూడా సాధించామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏడు యాంకర్ హబ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది సీప్లేన్ సేవలను ప్రారంభించనున్నామని, టెంపుల్ టూరిజాన్ని విస్తృతంగా అభివృద్ధి చేస్తూ 26 దేవాలయాల్లో టెంట్ సిటీ సౌకర్యాలు కల్పించనున్నామని చెప్పారు. కేరళ తరహాలో హౌస్బోట్లు, 60 ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆరు జిల్లాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఈకో టూరిజం, వెల్నెస్ సెంటర్ల ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను రాష్ట్రంలోనే నిర్వహించి త్వరలో అవార్డులు అందజేస్తామని మంత్రి చెప్పారు. పర్యాటక రంగానికి ఇది ఆంధ్రప్రదేశ్కు స్వర్ణయుగమని ఆయన వ్యాఖ్యానించారు.
