సంచలనం సృష్టించిన కల్తీ పాలు ఘటనపై రాజమండ్రి పాలు–పెరుగు వర్తకుల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రచారం జరుగుతున్న గణేష్కు తమ సంఘంతో ఎలాంటి సంబంధం లేదని సంఘం అధ్యక్షుడు సూరంపూడి పనసయ్య వెల్లడించారు. మంగళవారం నగరంలోని సంఘ నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గణేష్ తమ సంఘానికి చెందిన వ్యక్తి కాదని, సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలు, కథనాలు అసత్యమని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సంఘాన్ని ఈ ఘటనతో అనుసంధానం చేయడం సరికాదని పేర్కొన్నారు.
కల్తీ పాలు ఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికితీయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. స్వచ్ఛమైన గేదె పాలు సహజంగా 7–8 గంటలకే పరిమితమవుతాయని, రసాయనాల మిశ్రమంతోనే ఎక్కువ రోజులు నిల్వ ఉండగలవని వివరించారు.
సభ్యుల గుర్తింపులో స్పష్టత కోసం త్వరలో గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.
