తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని ఆవ రోడ్డులో 16వ వార్డు వాంబే అపార్ట్మెంట్స్ సమీపంలో ఉన్న 100 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఉన్న పార్క్ పునరుద్ధరణకు బీజేపీ నాయకుడు అడపా వరప్రసాద్ చొరవ తీసుకోవడంతో ఎనిమిదేళ్ల నిర్లక్ష్యానికి తెరపడింది.
గత ఎనిమిదేళ్లుగా ఈ పార్క్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురై డంపింగ్ యార్డుగా మారింది. జనసంచారం లేకపోవడంతో గంజాయి బ్యాచ్లు, మందుబాబులు అడ్డాగా ఉపయోగించుకుంటూ వచ్చారు. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు పార్క్ వైపు వెళ్లేందుకు సైతం వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్థానికుల సమస్యలను తెలుసుకున్న అడపా వరప్రసాద్ స్వయంగా పార్క్ను పరిశీలించి పరిస్థితిని నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. పార్క్లో పేరుకుపోయిన చెత్త, అసాంఘిక కార్యకలాపాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన కమిషనర్ వెంటనే జెసిబి యంత్రాన్ని పంపించి పార్క్ శుభ్రపరిచే పనులు ప్రారంభించమని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు చర్యలు ప్రారంభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా అడపా వరప్రసాద్ మాట్లాడుతూ, “ప్రజల భద్రత, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా పార్క్ను పునరుద్ధరించడం అత్యవసరం. ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రదేశాన్ని మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మా బాధ్యత” అని అన్నారు.
అలాగే పార్క్ చుట్టూ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, భద్రత కోసం గేటు నిర్మించాలని, పచ్చదనం పెంపొందించే చర్యలు చేపట్టాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు ముందుండి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
