వడ్డాది వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలలో 5వ రోజు మంగళవారం నాగవల్లి సందర్భంగా స్వామివారికి పూర్ణాహుతి, చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.చంద్ర గ్రహణం సందర్భంగా గిరిజాంబగిరిలోనే స్వామివారికి ఊరేగింపు నిర్వహించి అర్చకులు చక్రస్నానం చేయించారు. ధర్మకర్త కుటుంబ సభ్యులు దొండా శ్రీరామ్ విగ్రహాలకు చక్రస్నానం చేయించారు. వసంతోత్సవం, గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. మంగళవారం తెల్లవారుజామున స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.ఉదయం 11 గంటల వరకు స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.తదుపరి నైవేద్యం అనంతరం ఈవో టీఎన్ఎస్ శర్మ, అర్చకులు శ్రీకాంతాచార్యులు ఆలయ ద్వారాలను మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.గ్రామోత్సవం రద్దు చేయడంతో గ్రామంలో ఉత్సవాల సందడి తగ్గింది. గత నెల 27న ప్రారంభమైన కళ్యాణోత్సవాలు ఈ నెల 4న పుష్పాంజలి సేవతో ముగియనున్నాయి.
