విద్యా రంగంలో కూటమి కొత్త దిశ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ప్రారంభమయ్యాయని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సాయి దీపక్ పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుగా రూ.1200 కోట్లు విడుదల చేయడాన్ని ఆయన స్వాగతించారు.
ఈ సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కరాలరేవు వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
సాయి దీపక్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నారా లోకేష్ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలతో మధ్యలోనే చదువు ఆపేసిన అనేక మంది విద్యార్థులకు మళ్లీ విద్యను కొనసాగించే అవకాశం కలిగిందన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర విద్యా రంగానికి మేలు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
