Tuesday, May 5, 2026
HomePoliticsAndhra Pradeshటీవీకే విజయ్ కు ఉచ్చు

టీవీకే విజయ్ కు ఉచ్చు

తొక్కిసలాటపై చార్జిషీటు

రాజకీయంగా ఇబ్బందులు

తమిళనాట రసవత్తరంగా రాజకీయం

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ‘కరూర్ తొక్కిసలాట ఘటన సెంట్రిక్ పాయింట్‌గా మారింది. నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోందని తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఘటనలో విజయ్‌ను బాధ్యుడిని చేస్తూ సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయబోతోందన్న ప్రచారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 2025లో కరూర్‌లో జరిగిన టీవీకే బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ, తాజాగా విజయ్ ప్రయాణించిన వాహనం నిర్దేశించిన హద్దులను దాటి జనం మధ్యలోకి వెళ్లడమే ప్రమాదానికి ప్రధాన కారణమని గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులు సూచించిన చోట కాకుండా, కేవలం విజువల్స్, పబ్లిసిటీ కోసం వాహనాన్ని నిబంధనలకు విరుద్ధంగా 20 మీటర్ల ముందుకు తీసుకెళ్లడం వల్లే తోపులాట జరిగిందని లీకులు వస్తున్నాయి. దీనినే ప్రధానాంశంగా తీసుకుని విజయ్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తోందన్నది ఇప్పుడు హాట్ టాపిక్. మూడు సార్లు విజయ్ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో వరుసగా విచారణకు హాజరయ్యారు. మార్చి 15న సుమారు 7 గంటల పాటు జరిగిన విచారణలో అధికారులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం. ప్రమాదం జరుగుతున్నట్లు తెలిసినా ప్రసంగాన్ని ఎందుకు ఆపలేదు? జనం స్పృహతప్పి పడిపోతున్నా కాన్వాయ్‌ను ఎందుకు ముందుకు తీసుకెళ్లారు? వంటి సూటి ప్రశ్నలతో విజయ్‌ను నిలదీసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసి బయటకు వచ్చినప్పుడు విజయ్ చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేసినప్పటికీ, లోపల జరిగిన విచారణ తీరు మాత్రం ఆయనకు ప్రతికూలంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వేళ విజయ్‌ను ఇరకాటంలో పెట్టడానికే కేంద్ర సంస్థలను వాడుకుంటున్నారని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఒకవేళ ఎన్నికలకు ముందు సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తే, అది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని రాజకీయ కుట్ర గా అభివర్ణిస్తూనే, విచారణకు సహకరిస్తామని టీవీకే నేతలు చెబుతున్నారు. అయితే, 41 మంది అమాయకుల ప్రాణాలు పోయిన ఘటనలో బాధ్యత ఎవరిదో తేలాల్సిందేనని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. విజయ్ సొంతంగానే పోటీ చేస్తాం అని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ కేసు ఆయనను రక్షణలో పడేసింది. సీబీఐ విచారణ కారణంగా ఆయన ప్రచార షెడ్యూల్ దెబ్బతినడమే కాకుండా, ప్రత్యర్థులకు ఒక బలమైన అస్త్రాన్ని అందించినట్లయింది. ముఖ్యంగా కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని కూడా సీబీఐ విచారణకు పిలవడంతో, ఈ కేసులో మరిన్ని రాజకీయ మలుపులు చోటుచేసుకునేలా ఉన్నాయి. తమిళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. కేవలం విజయ్ మాత్రమే కాకుండా, సభ నిర్వహణలో విఫలమైన ఆయన సన్నిహిత వర్గంపై కూడా చర్యలు ఉండబోతున్నాయని ప్రచారం సాగుతోంది. సీబీఐ తన స్టేటస్ రిపోర్ట్ ను త్వరలోనే సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో, ఈ నెలాఖరులోపు ఛార్జ్‌షీట్ రూపంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కరూర్ ఘటన విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఒక పెద్ద సవాల్‌గా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments