సముద్ర రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు
రాష్ట్ర సముద్ర రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. దుగ్గరాజపట్నంలో ప్రపంచ స్థాయి నౌకా నిర్మాణం, నౌకా మరమ్మత్తు మరియు అనుబంధ సముద్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి కోసం షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ను ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ వ్యూహాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ సముద్ర రంగానికి మహత్తర ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా, రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ నౌకా నిర్మాణ మరియు హెవీ ఇండస్ట్రీస్ కేంద్రంగా నిలబెట్టే దిశగా కీలక అడుగుగా నిలుస్తుంది. దీని ద్వారా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సంయుక్తంగా 50:50 నిష్పత్తిలో ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థగా అమలు చేయనున్నాయి. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ షిప్ బిల్డింగ్ ఫైనాన్సియల్ అసిస్టెన్స్ పాలసీ పథకం కింద చేపడుతుండగా, సంబంధిత మార్గదర్శకాల ప్రకారం వ్యూహాత్మక షిప్యార్డ్ భాగస్వామిని ఎంపిక చేయనున్నారు. దుగ్గరాజపట్నం షిప్బిల్డింగ్ క్లస్టర్ భారతదేశ నౌకా నిర్మాణ మరమ్మత్తు రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతూ, పెద్ద ఎత్తున ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా, దక్షిణ భారత తీర ప్రాంత పారిశ్రామికీకరణకు దోహదం చేయనుంది.
₹29,662 కోట్ల అంచనా వ్యయంతో, నెల్లూరు జిల్లాలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందనున్న ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు గణనీయమైన తోడ్పాటు అందించనుంది. 974 కిలోమీటర్ల విస్తారమైన తీరరేఖను వినియోగించుకుంటూ, దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తూ, దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
ఈ సమగ్ర సముద్ర పరిశ్రమ కేంద్రంలో నాలుగు డ్రై డాక్స్, షిప్ లిఫ్ట్ సదుపాయాలు మరియు అత్యాధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. సంవత్సరానికి 1.2 మిలియన్ గ్రాస్ టన్నేజ్ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇది భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మరింత బలం చేకూర్చనుంది. అలాగే ప్రాంతీయ పరిశ్రమలకు లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి తయారీ, వాణిజ్యం మరియు ఎగుమతులకు పోటీ శక్తిని పెంచనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నౌకా భాగాల తయారీదారులు, సముద్ర పరికరాల సరఫరాదారులు మరియు లాజిస్టిక్స్ సేవల సంస్థల నుండి ₹8 వేల నుండి ₹10 వేల కోట్ల వరకు అనుబంధ పెట్టుబడులు వచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో కలిసి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకు వెళ్ళడంలో పోర్ట్ చైర్ పర్సన్ డా ఎం అంగముత్తు కృషి చేసారని పోర్ట్ వర్గాలు అంటున్నాయి.
